ఈడీ విచారణకు మహేష్‌ బాబు ,వాళ్ల నుంచి డబ్బు తీసుకుంన్నందే నోటీసులు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లపై ఈడీ రీసెంట్‌గా జరిపిన సోదాల నేపథ్యంలో మహేష్‌బాబుకు ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2025 | 04:46 PMLast Updated on: Apr 22, 2025 | 4:46 PM

Mahesh Babu For Ed Investigation

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లపై ఈడీ రీసెంట్‌గా జరిపిన సోదాల నేపథ్యంలో మహేష్‌బాబుకు ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేష్ బాబును ఆదేశించింది ఈడీ. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ తమ ప్రాజెక్టులకు ప్రచారం చేసినందుకు గాను మహేష్ బాబుకు 5 కోట్ల 9 లక్షలు చెల్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో 3 కోట్ల 4 లక్షలు చెక్కుల ద్వారా, మరో 2 కోట్ల 5 లక్షలు నగదు రూపంలో మహేష్ బాబుకు ముట్టినట్లు సమాచారం.

ఈ నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇది మనీ లాండరింగ్‌కు సంబంధించిన అంశమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా.. ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, సురానా గ్రూప్ డైరెక్టర్ నరేంద్ర సురానా కొనుగోలుదారులను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించడం, ఒకే ప్లాటును పలువురికి అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం లాంటి మోసాలకు పాల్పడ్డారని వారిపై అభియోగాలు ఉన్నాయి. మహేష్ బాబు సాయి సూర్య ప్రాజెక్టులను ప్రచారం చేయడం వల్ల చాలా మంది ఆ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారని, అయితే ఆ సంస్థ మోసపూరిత కార్యకలాపాల గురించి వారికి తెలియదని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

ఈ కుంభకోణంలో మహేష్ బాబు నేరుగా పాల్గొనకపోయినా, ఆయనకు అందిన డబ్బుపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ నెల 16న ఈడీ అధికారులు సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, నగదుకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థలు సుమారు 100 కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఈడీ అనుమానిస్తోంది. మోసపూరిత పథకాల ద్వారా సంపాదించిన డబ్బును పలువురికి మళ్లించారని, ఇందులో భాగంగానే సినీ ప్రముఖులు కూడా ప్రచారానికి డబ్బులు తీసుకున్నారని ఈడీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.