ఢిల్లీకి హ్యారీ బ్రూక్ షాక్ ,రెండేళ్ళు బ్యాన్ తప్పదా ?
విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ సీజన్ కు ముందు ఫ్రాంచైజీలకు షాకిస్తున్నారు. వేలంలో అమ్ముడైన తర్వాత ఇప్పుడు సీజన్ కు ఆడేది లేదంటున్నారు.

విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ సీజన్ కు ముందు ఫ్రాంచైజీలకు షాకిస్తున్నారు. వేలంలో అమ్ముడైన తర్వాత ఇప్పుడు సీజన్ కు ఆడేది లేదంటున్నారు. గతంలో పలుసార్లు ఈ పరిస్థితి తలెత్తడంతో దీనిని కంట్రోల్ చేసేందుకు బీసీసీఐ కఠిన నిబంధనలే తీసుకొచ్చింది. అయినా కూడా విదేశీ ఆటగాళ్ళు లెక్క చెస్తున్నట్టు కనిపించడం లేదు. తాజాగా ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ 18వ సీజన్ నుంచి తప్పుకున్నాడు. జాతీయ జట్టుకు ఆడడమే తొలి ప్రాధాన్యతగా చెప్పిన బ్రూక్ తర్వాతి సిరీస్ల కోసం ప్రిపేర్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. సీజన్ నుంచి తప్పుకుంటున్నందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఐపీఎల్ మెగా వేలంలో 6.25 కోట్ల భారీ ధరకు బ్రూక్ను దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కొనుగోలు చేశాక ఐపీఎల్ నుంచి వైదొలగడం ఇది వరుసగా రెండో సారి. గత సీజన్ లోనూ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.
అయితే ఇది చాలా కఠినమైన నిర్ణయమని బ్రూక్ చెప్పుకొచ్చాడు.. కానీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయాన్ని ఇంగ్లండ్ క్రికెట్కు కేటాయించాలని అనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, ఆ జట్టు అభిమానులకు కూడా క్షమాపణలు చెప్పాడు. బీసీసీఐ కొత్త రూల్స్ ప్రకారం.. వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్, ఆ తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకోకూడదు. ముఖ్యంగా సరైన కారణంగా లేకుండా తప్పుకుంటే అతడిపై రెండేళ్ల నిషేధం పడుతుంది. కాబట్టి హ్యారీ బ్రూక్పై బ్యాన్ పడే అవకాశం ఉంది. మరి హ్యారీ బ్రూక్పై ఐపీఎల్ నిర్వహకులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఐపీఎల్ 2023లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున హ్యారీ ఆడాడు. 13.25 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్కి ఆడిన హ్యారీ బ్రూక్, 11 మ్యాచుల్లో 190 పరుగులు చేశాడు. దీంతో ఈ స్టార్ ప్లేయర్ ను సన్ రైజర్స్ వేలానికి ముందే వదిలేసింది.
ఇదిలా ఉంచే ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి జోస్ బట్లర్ రాజీనామా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంగ్లీష్ టీమ్ ఇంటిదారి పట్టింది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ బట్లర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్ధానంలో బ్రూక్ ఇంగ్లండ్ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. కాగా ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22న నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.